పరిచయం :
- పట్నంలో శాలిబండ'... నాటి తరంవారికి ఎంతో పరిచయమున్న జానపద గీతం. దీన్ని 'అమాయకుడు' చిత్రం కోసం రాశారు గీత రచయితా దర్శకులూ ఆచ్చి వేణుగోపాలాచార్యులు. ఆ పాటకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయన ఇలా పంచుకున్నారు.
అది 1968 ప్రాంతం... హైదరాబాద్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రోజులవి. అప్పటికే అడపాదడపా సినిమాలకి పాటలు రాసేందుకు చెన్నై వెళ్లి వస్తూండేవాణ్ని. ఆ రోజుల్లోనే రాజ్కపూర్ నటించిన 'అనాడీ' విడుదలై సూపర్హిట్ అయింది. దాన్ని తెలుగులో పునర్నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. కొంతమంది మిత్రులు నిర్మాతలుగా ఉంటామన్నారు. సరే, హీరో ఎవరు? ఎన్టీ రామారావుగారో నాగేశ్వరరావుగారో అనుకున్నాం. అప్పట్లో వాళ్లు యాభై అరవైవేలు పారితోషికం తీసుకుంటున్నారు. మేం అంతకంటే తక్కువ బడ్జెట్లో చేద్దామనుకున్నాం. వేరే హీరో కోసం హైదరాబాద్ నుంచి మద్రాస్ వెళ్లాం. కృష్ణగారిని కలుద్దామని వెళ్తే ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నారని తెలిసింది. రెండుమూడ్రోజులు తరువాత ఆయన్ని కలిసి విషయం చెబితే ఓకే అన్నారు. హీరోయిన్గా జమున నటిస్తామన్నారు. అలా వెుదలైంది 'అమాయకుడు' చిత్రం.
- ఆ చిత్రానికి మల్లాదిగారితో ఓ పాట రాయించారు. మరోపాట నారాయణరెడ్డిగారు రాశారు. ఇవి రికార్డింగ్ అయిపోయిన తరువాత 'ఇందులో ఓ ఫోక్సాంగ్ ఉంటే బాగుంటుంది. అదీ హైదరాబాద్ నేటివిటీతో ఉండాలి' అన్నారు అడ్డాల నారాయణరావు. ఆయనా నేనూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాం. సరే, నేనే రాస్తాన్లెండని చెప్పా. రాద్దామని ఇంటికొచ్చి కూర్చున్నా.
ఆమెకి తొలిపాట!
హైదరాబాద్ నేటివిటీ అంటే ఏం కావాలి? చాలా ఆలోచించా. నగరంలో చార్మినార్, మక్కా మసీదు... ఇవి అందరికీ తెలిసినవే. మరి, తెలియనవి ఏవుంటాయ్? అప్పుడు తట్టింది... భాగ్యనగరంలో కొన్ని 'బండలు'న్నాయి కదా అని! బండలంటే రాళ్లని కాదు... శాలిబండా అల్లబండా ఇలాంటివాటితో పాట రాస్తే కొత్తగా ఉంటుందనిపించింది. 'పట్నంలో శాలిబండ/ పేరైనా గోలుకొండ/ చూపించు సూపునిండా/ పిసల్ పిసల్ బండ...' అంటూ పల్లవి వెుదలుపెట్టా. ఒక్కరోజులో చకచకా రెండు చరణాలు రాసేశా. దాన్ని మా టీంలో అందరికీ చూపిస్తే 'భలే గమ్మత్తుగా ఉందే' అని మెచ్చుకున్నారు. దీనికి బి.శంకర్ మంచి బాణీ కట్టారు. ఎవరిదైనా కొత్త గొంతుతో పాడిస్తే బాగుంటుంది అనుకున్నాం. ఎల్.ఆర్.ఈశ్వరిని సంప్రదించాం. ఆమె అప్పటికింకా తెలుగులో ఏ సినిమాకీ పాడలేదు. ఇదే తొలిపాట. ట్యూన్ విని 'ఈపాట నేనే పాడతా. రెమ్యునరేషన్ కూడా వద్దు' అన్నారు. అలా మద్రాస్లో రికార్డింగ్ జరిగింది. అప్పట్నుంచి పాట హవా వెుదలైంది. స్టూడియోలో విన్నవాళ్లంతా ఇది సూపర్హిట్ సాంగ్ అయిపోతుందనడం వెుదలుపెట్టారు. షూటింగ్ జరగకముందే పాటపై అంచనాలు పెరిగిపోయాయి. దాంతో ఈ పాటకు ఎవరితో డాన్స్ చేయించాలనేది పెద్ద ప్రశ్నగా మారింది.
చనిపోతానంది!
- మద్రాసులో ఓ పాత్రికేయ మిత్రుడున్నాడు. అతని స్నేహితురాలు ఒకామె 'ఈపాటకి నేనే డాన్స్ చేస్తా'నంటూ పట్టుబట్టింది. 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా' అంటూ వహీదా రహమాన్లా ఒక్కపాటతో పాపులర్ అయిపోవాలనుకుంది. సరే చూద్దామని ఆమెని హైదరాబాద్ పిలిపించాం. సారథి స్టూడియోలో షూటింగ్ పెట్టుకున్నాం. మూడ్రోజులపాటు షూటింగ్ జరిగింది. కానీ, ఒక్కషాటూ ఓకే కాలే! ఆమె సరిగా డాన్స్ చేయలేకపోయింది. స్టెప్పులు కుదరడం లేదు. ఈమెతో లాభంలేదని వేరే ఎవరితోనైనా చేయిద్దామని ప్రయత్నాలు వెుదలుపెట్టాం. గిరిజను అడిగితే 'ఈ పాటకి నేను సరిపోను' అంది. ఈ లోపల ఆ జర్నలిస్టు స్నేహితురాలు తన గదిలో తలుపులేసుకుని నిరాహారదీక్షకు దిగింది! తనని కాదని వేరే ఎవరితోనైనా పాట షూటింగ్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది! అంతేకాదు, నేరుగా జమునని కలిసి వెురపెట్టుకుందట. మరోపక్క... జ్యోతిలక్ష్మి ఈ పాట విన్నదట. 'చాలామంచి పాట. పైసా తీసుకోకుండా డాన్స్ చేస్తా' అంటూ ఆవిడ సిద్ధమైపోయింది. అప్పటికే ఆడియో విడుదలై ఆ పాట సూపర్హిట్త్టె కూర్చుంది. ఎటూ దారితోచక అందరమూ తలలు పట్టుకున్నాం. వెుత్తానికి జమున సలహా మేరకు చివరకి ఆ బెదిరించిన అమ్మాయితోనే డాన్స్ చేయించి మ.మ. అనిపించాల్సి వచ్చింది. తరువాత 'అమాయకుడు' రిలీజ్ అయింది. సూపర్హిట్. కొన్ని థియేటర్లలో 200 రోజులు కూడా ఆడింది.
ఆ పాటతో ఎల్.ఆర్.ఈశ్వరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆమె హైదరాబాద్ ఏ ఫంక్షన్కి వచ్చినా ఈ పాట తప్పక పాడేది. గేయ రచయితగా నాకు మంచి పేరు తెచ్చిందీ ఈ పాటే. అమాయకుడు రిలీజ్ తరువాత చాలామంది నన్ను 'శాలిబండగారు' అని పిలవడం వెుదలుపెట్టారు. ఏవైనా ఫంక్షన్లకి వెళ్తే... 'అదిగో శాలిబండగారు వచ్చారు' అనేవారు. అప్పట్లో ఏవైనా శుభకార్యాలకి బ్యాండ్ మేళం బుక్ చేసుకునేవాళ్లు 'పట్నంలో శాలిబండ పాట వచ్చా' అని అడిగాకనే బేరం కుదుర్చుకునేవారు. అంత పాపులర్ ఆ పాట. మరచిపోలేని మరో సంగతేంటంటే... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రికార్డింగ్ డాన్స్ ట్రూపుల నుంచి నాకు చాలా ఉత్తరాలొచ్చాయి. అన్నిటి సారాంశం ఒక్కటే... 'మీ పాటతో నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నాం. ధన్యవాదాలు' అని. ఆ ఉత్తరాలను చూసి చాలా సంతోషించా. ఇంతకంటే ఇంకేం కావాలి!
- పాటకచేరి
- గానం: ఎల్.ఆర్.ఈశ్వరి; సంగీతం: బి.శంకర్
- పల్లవి:
- పట్నంలో శాలిబండ
- పేరైనా గోలుకొండ
- చూపించు సూపునిండా
- పిసల్ పిసల్ బండ
- చరణం 1:
- వయసు పిల్ల ఒంటి సొంపు
- అది వంగీ ఉంటే భలే ఇంపు
- అబ్బా అబ్బా... వంగీ ఉంటే భలే ఇంపు
- ఓర సూపు వలవేసి
- దోర వయసు దోచేసి
- గులకరాళ్ల నీటిలోన సెలయేటి బాటలోన
- ఒక్కసారి సూడాలి సంబరాల చాటుబండ
- పిసల్ పిసల్ బండ
- ||పట్నంలో||
- చరణం 2:
- చేపకనుల చిన్నదోయి
- నీ చేతికైతే చిక్కదోయి
- అల్లిబిల్లి అయి ఉండ
- బల్ల పరుపు అల్లబండ
- అయ్యో అయ్యో బల్లపరుపు అల్లబండ
- పిసల్ పిసల్ బండ
- ||పట్నంలో||
- ==========================
visiti my website >
Dr.Seshagirirao-MBBS.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog